రెజ్లర్ల ఆందోళనకు రైతు నేతల మద్దతు

Telugu Lo Computer
0


రెజ్లర్ల ఆందోళనకు రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా వారి ఆందోళనకు సంఘీభావం తెలియజేసేందుకు సంఘం నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల నుంచి ఖాప్‌ పంచాయితీ నేతలు సైతం రెజ్లర్ల ఆందోళన స్థలికి బయల్దేరారు. దీంతో జంతర్‌ మంతర్‌తో పాటు ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ను తొలగించాలంటూ జంతర్‌ మంతర్‌ వద్ద 10 రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి సంఘీభావం తెలిపేందుకు పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు ఢిల్లీకి బయల్దేరారు. టిక్రి బోర్డర్‌ వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రైవేటు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని, ట్రాక్టర్లకు అనుమతి లేదని తిప్పి పంపుతున్నారు. మరోవైపు ఒకరోజు సంఘీభావం తెలియజేసేందుకు తాము ఢిల్లీ వెళుతున్నామని, ఒకవేళ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నేతలు తెలిపారు. మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు చేపడతామని ఇప్పటికే సంయుక్త కిసాన్‌ మోర్చా పేర్కొంది. ఈ నెల 11 నుంచి 18 వరకూ అన్ని రాష్ట్ర రాజధానులు, జిల్లా, తాలూకా కేంద్రాల్లో సభలు, నిరసన ర్యాలీలను చేపడతామని తెలిపింది. గతంలో రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఈ సంఘం సుదీర్ఘకాలం పాటు పోరాడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)