తలరాతలు మార్చే శక్తి చదువుకే ఉంది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్‌మోహన్ రెడ్డి నాలుగో విడుత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొని బటన్ నొక్కి 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు, తలరాతలు మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని జగన్ అన్నారు. పేదరికం చదువుకు అడ్డుకాకూడదని, పేదరికం వల్ల చదువులు ఆపేసే పరిస్థితి రాకూడదని విద్యా దీవెన ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జగన్ చెప్పారు. గత ప్రభుత్వంలో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూశామని, అరకొరగా ఫీజురీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, బకాయిలు లేకుండా నూరుశాతం ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నామని జగన్ తెలిపారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చంద్రబాబు హయాంలో ఎగ్గొట్టిన బకాయిలనుసైతం వైసీపీ అధికారంలోకి వచ్చాక చెల్లించామని జగన్ అన్నారు. 6వ తరగతి నుంచి ప్రతీ క్లాస్ కూడా డిజిటలైజ్ అవుతుందని, ఒక్కసారి ప్రభుత్వ బడులు డిజిటలైజ్ అయితే ప్రైవేట్ పాఠశాలలు కూడా పోటీ పడక తప్పదని జగన్ అన్నారు. 8వ తరగతిలో అడుగుపెట్టిన ప్రతీ విద్యార్థికి నా పుట్టినరోజున ట్యాబ్స్ ఇస్తున్నామని తెలిపారు. రెండేళ్లు టైం ఇవ్వాలని కోరిన జగన్.. ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీ పడలేవు అనే మాటను తుడిచేస్తానని చెప్పారు. హైయర్ ఎడ్యూకేషన్‌లోనూ మార్పులు తీసుకొచ్చామని, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని జగన్ తెలిపారు. వైకాపా హయాంలో కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చామని, 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని జగన్ తెలిపారు. 45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించామని తెలిపారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నామని, ఫీజులు మాత్రమే కాదు.. వసతి ఖర్చులు కూడా ఇస్తున్నామని జగన్ అన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగిందని జగన్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)