గురుగ్రామ్లో జి20 సమావేశానికి హాజరయ్యే అతిథులకు కనువిందుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన పూలకుండీలను ఇద్దరు వ్యక్తులు తస్కరిస్తూ కెమెరాలో చిక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూ ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్పైన ఆంబియన్స్ మాల్ సమీపంలో సోమవారం ఈ ఘరట చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. విలాసవంతమైన ఎస్యువిలో పూలకుండీలను ఇద్దరు వ్యక్తులు తరలించుకుపోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన నాయకులు పాల్గొననున్న ఈ సమావేశాలను పురస్కరించుకుని నగర సుందరీకరణలో భాగంగా చాలాచోట్ల అందమైన, రంగు రంగుల పూల మొక్కలతోకూడిన కుండీలను అమర్చారు. జి20 సమావేశానికి సంబంధించిన హోర్డింగ్ అమర్చిన చోటనే ఇద్దరు వ్యక్తులు తమ కారులో పూలకుండీలను వేసుకుని పారిపోవడాన్ని వీడియోలో కనబడింది. అటుగా వెళ్తున్న ఒక పాదచారి ఈ వీడియోను చిత్రీకరించి ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మంగళవారం సాయంత్రం గురుగ్రామ్ డిఎల్ఎఫ్ ఫేస్ 3 పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిసాంత్ కుమార్ యాదవ్ ఒక ట్వీట్కు స్పందిస్తూ పూలకుండీల తస్కరణ తమ దృష్టికి వచ్చిందని, దీనిపై దర్యాప్తు జరపాలని గురుగ్రామ్ పోలీసులను ఆదేశించామని తెలిపారు. నిందితులను, వారి వాహనాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
లగ్జరీ కారులో వచ్చి పూలకుండీల చోరీ !
March 01, 2023
0
Tags