కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఐఏఎస్ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ రూపా మౌద్గల్ పరస్పర ఆరోపణల వ్యవహారంలోప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ పోస్టింగ్ ఇవ్వకుండానే తక్షణమే బదిలీ చేసింది. వివాదం చెలరేగిన మరుసటి రోజునే ఇద్దరినీ వారివారి శాఖల నుంచి గెంటేసినంత పనిచేసింది. ఇరువురూ కర్ణాటక చీఫ్ సెక్రటరీ వద్ద ఫిర్యాదు చేసిన మరుసటి రోజు మంగళవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపా మౌద్గల్ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. ఈ మేరకు ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేయాలని చీఫ్ సెక్రటరీని సోమవారం ఆదేశించారు. అందుకు అనుగుణంగానే సోమవారం మధ్యాహ్నం ఐఏఎస్ రోహిణి సింధూరి విధానసౌధలో చీఫ్ సెక్రటరీ వందితాశర్మను భేటీ అయ్యారు. నాలుగు పేజీలతో ఐపీఎస్ రూపా మౌద్గల్ ఆరోపణలకు వివరాలను అందించారు. తనపై సోషల్ మీడియాలో నిరాధార, అబద్ధాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారని, సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించిన మేరకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం విధానసౌధలో రోహిణి సింధూరి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మీడియా ముందుకు రాకూడదనే నిబంధన ఉందన్నారు. కానీ వ్యక్తిగతంగా తనతోపాటు తన భర్తపైనా ఆరోపణలు చేశారన్నారు. చీఫ్ సెక్రటరీకి సమగ్రంగా వివరాలు అందించానని తెలిపారు. మండ్యలో సీఈఓగా శౌచాలయాలు రికార్డు స్థాయిలో నిర్మించినందుకు కేంద్రప్రభుత్వం గుర్తించిందని, ఇన్నేళ్ల తర్వాత ఆరోపణలు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఫొటోలు పంపాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జాలహళ్లిలోని నివాసం తన భర్త తల్లికి చెందినదన్నారు. ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన మేరకు విధానసౌధలో సీఎస్ వందితా శర్మను ఐపీఎస్ రూపా మౌద్గల్ భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందుకు రాకూడదని భావించానని అయితే తనపై రోహిణి సింధూరి ఆరోపణలు చేసిన మేరకు స్పందించాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికే సీఎ్సకు వివరాలు తెలిపానని, ఆమె ఫొటోలు వ్యక్తిగతం కాదని, ఎవరు రక్షిస్తున్నారో బయటకు రావాలన్నారు. రోహిణిపై లోకాయుక్తకు చేరిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. జాలహళ్లి నివాసానికి సంబంధించి ఆస్తి పత్రంలో నమోదు చేయలేదని, తనది కాదంటే లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. సీఎ్సను కలిసేందుకు ముందు మీడియాతో మాట్లాడుతూ గెట్ వెల్ సూన్ అంటూ పోస్ట్ చేశారని, డిలీట్ అయిన న్యూడ్ ఫొటోల గురించి మాట్లాడుతారా..? అంటూ రూపా ఆరోపించడం మరో సంచలనమైంది.
పోస్టింగ్ ఇవ్వకుండా తక్షణమే బదిలీ చేసిన ప్రభుత్వం !
February 21, 2023
0
Tags