సెల్ఫీ ఇవ్వలేదన్న కారణంతో పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్పై ఓ గుంపు దాడికి పాల్పడింది. ఈ కేసులో దాడికి పాల్పడిన వారిని పోలీసులు అప్పుడే అరెస్ట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ కేసులో ఓ కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దాడి చేసిన వారిలో ఒకరైన సోషల్ మీడియా స్టార్ సప్నా గిల్, తాజాగా బెయిల్ మీద బయటకొచ్చింది. ఇలా బయటకు రావడమే ఆలస్యం.. పృథ్వీ షా, ఆశిష్లపై రివర్స్ కేసు పెట్టింది. పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టాడని, తనను అసభ్యంగా తాకడంతో పాటు నెట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అతడలా ప్రవర్తించడం వల్లే ప్రతిఘటించాల్సి వచ్చిందని తెలిపింది. సప్నాగిల్ మాట్లాడుతూ.. ''ఫిబ్రవరి 15వ తేదీన నేను, నా స్నేహితులు కలిసి క్లబ్కు వెళ్లాం. అక్కడ పృథ్వీ షాని చూసి, నా స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ దిగాలని అనుకున్నాడు. అందుకోసం పృథ్వీ షాను అడగ్గా.. అతడు వాగ్వాదానికి దిగాడు. మేమంతా పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. నా స్నేహితురాలి ఫోన్ని పృథ్వీ లాక్కొని, నేలకేసి కొట్టాడు. నిజానికి నాకు క్రికెట్పై అంత ఆసక్తి లేదు. ఈ పృథ్వీ షా ఎవరో కూడా నాకు తెలీదు. సెల్ఫీ అడిగినందుకు.. పృథ్వీ, అతని స్నేహితుడు కలిసి కావాలనే దాడి చేశారు. నేను వద్దని వారించినా, నా మాటలు వినకుండా అనుచితంగా ప్రవర్తించారు. ఆ సమయంలోనే పృథ్వీ నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు'' అంటూ చెప్పుకొచ్చింది. ఇదే టైంలో తాను రూ.50 వేలు అడిగానని పృథ్వీ చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని, రెండు రీల్స్ చేసి ఒక్క రోజులోనే ఆ డబ్బు సంపాదించగలనని వివరణ ఇచ్చింది.
పృథ్వీ షా పై కేసు పెట్టిన సప్నా గిల్
February 21, 2023
0
Tags