బీజేపీకి అదానీ పవిత్ర ఆవు !

Telugu Lo Computer
0


గౌతమ్‌ అదానీ బీజేపీకి పవిత్రమైన ఆవు అని శివసేన నాయకుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వాలంటైన్స్‌ డే అయిన ఫిబ్రవరి 14ను 'గోవు హగ్‌ డే'గా జరుపుకోవాలని ప్రజలను కోరుతూ జంతు సంక్షేమ బోర్డు ఇటీవల జారీ చేసిన నోటీసుపై ఆయన స్పందించారు. 'బీజేపీకి అదానీ పవిత్రమైన ఆవు. అందుకే, వారు తమ పవిత్రమైన ఆవును కౌగిలించుకున్నారు. ప్రేమికుల రోజున మేము హగ్‌ చేసుకునేందుకు ఇతర ఆవులను మాకు వదిలేశారు' అని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. అయితే తాము ఆవును గోమాతగా గౌరవిస్తామని చెప్పారు. గోవుపై తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదని అన్నారు. అదానీ కంపెనీల షేర్లలో అవకతవకలు జరిగినట్లు హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదిక పేర్కొంది. దీంతో పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలను ఈ అంశం కుదిపేస్తున్నది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసం కోల్పోయేలా చేసిన గౌతమ్‌ అదానీ కంపెనీలపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతోపాటు ప్రధాని మోదీ, అదానీకి మద్దతుగా పార్లమెంట్‌లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)