సోషల్ మీడియాలో ప్రభావశీలురుగా చెలామణి అవుతున్న వారికి కేంద్ర సర్కార్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా తమకు చెందిన వాణిజ్య ఒప్పందాల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. బహుమతులు, హోటల్ అకామిడేషన్, ఈక్విటీ, డిస్కౌంట్లు, అవార్డులు ఏవి వచ్చినా వాటి గురించి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వెల్లడించాల్సి ఉంటుందని ప్రభుత్వం తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. ఒకవేళ ఎవరైనా ఆ వివరాలు ఇవ్వకుంటే అప్పుడు న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే ఆ వాణిజ్యం ఒప్పందాలను బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పుడు వాణిజ్య ప్రకటనలను అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలన్న ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. సోషల్ ఇన్ప్లుయెన్సర్ మార్కెట్ 2025 నాటికి 2800 కోట్లకు చేరుకుంటుందని, ఆ మార్కెట్ ప్రతి ఏడాది 20 శాతం పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎండార్సమెంట్లకు చెందిన కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. సెలబ్రిటీలు, ఇన్ప్లుయెన్సర్స్, వర్చువల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఈ కొత్త ఆదేశాలు వర్తించనున్నాయి. ఒకవేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే అప్పుడు వారికి భారీ జరిమానా విధించనున్నారు. 2019 నాటి వినియోగదారుల రక్షణ చట్టం కింద ఆ ఫైన్ వేస్తారు. ఉత్పత్తిదారులు, అడ్వటైజర్లు, ఎండార్సర్లపై సుమారు 10 లక్షల వరకు జరిమాన విధించనున్నారు. అవసరమైతే సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ప్రకారం 50 లక్షల వరకు కూడా జరిమానా ఉంటుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కొత్త మార్గదర్శకాలను ఆవిష్కరించారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు కొత్త నిబంధనలు !
January 21, 2023
0
Tags