ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రాజాంలో గల ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జున రావు సారథ్యంలో జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన విద్యాసంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నాయకత్వ లక్షణాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దేశానికి అలాంటి యువతరమే అవసరం ఉందని నారాయణ మూర్తి అన్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను మార్పునకు అవకాశంగా భావించాలని సూచించారు. తమను తాము నాయకుడిగా ఊహించుకోవాలని, ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదనీ అన్నారు. నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకోవాలని అన్నారు. దేశంలో అవినీతి, కాలుష్యం అధికంగా ఉందని, రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత్తో పోల్చి చూసినప్పుడు సింగపూర్ ఎంతో బాగుంటుందని పేర్కొన్నారు. అక్కడి వాతావరణం, వ్యవస్థల పనితీరు చక్కగా ఉంటుందని అన్నారు. వాస్తవికత అంటే పరిశుభ్రమైన రహదారులు, కాలుష్య రహిత వాతావరణ సింగపూర్లో ఉందని పేర్కొన్నారు. అలాంటి కొత్త, వాస్తవికత పరిస్థితులను సృష్టించడం విద్యార్థుల బాధ్యత అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు. సమాజంలో మార్పును తీసుకురావాలనే ఆలోచనను యువతరం పెంపొందించుకోవాల్సి ఉందని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజలు, సమాజం, దేశం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని అలవాటు చేసుకోవాలని, వాటిని నేర్చుకోవాలని ఆయన హితబోధ చేశారు.
నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలి !
December 19, 2022
0
Tags