దేశీయ ఐటీ రంగ సంస్థలు వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ వైపునకు అడుగులు వేస్తున్నాయి. ఇన్ఫోసిస్ సైతం తమ ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పనిచేయాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అంతర్గతంగా ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే దశలవారీగా వర్క్ ఫ్రం ఆఫీస్ను అమలు చేయాలని కంపెనీ యోచిస్తున్నదని అంటున్నారు. ఇప్పటికే దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ ఈ తరహా ఆదేశాలను తమ ఉద్యోగులకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ప్రారంభించింది. కొంత మందిని ఇంటి దగ్గర్నుంచి, మరికొంత మందిని ఆఫీసుల నుంచి పనిచేయించుకోవడమే ఈ హైబ్రిడ్ పద్ధతి. వారంవారం లేదా నెలనెలా ఉద్యోగులు మారుతూ ఉంటారు. ఈ క్రమంలో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో వెళ్తున్నట్టు వినిపిస్తున్నది. 'త్రీ ఫేజ్ వర్క్ ఫ్రం ఆఫీస్ ప్లాన్’ను ఇన్ఫోసిస్ అనుసరించే వీలున్నట్టు చెప్తున్నారు. కంపెనీ నోటీసుల ప్రకారం మొదటి దశలో ఉద్యోగుల వీలుననుసరించి వారానికి రెండుసార్లు ఆఫీసుకు రప్పిస్తారు. రెండో దశలో ఉద్యోగుల ఇష్టప్రకారం బదిలీలు, బ్రాంచీ ఆఫీసుల మార్పుంటుంది. 54 దేశాల్లో 247 చోట్ల ఇన్ఫోసిస్ కార్యకలాపాలున్నది తెలిసిందే. తుది దశలో తొలి రెండు దశల అనుభవంపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. దీని ఆధారంగా హైబ్రిడ్ వర్క్ పాలసీని అమలు చేస్తారు. ఉద్యోగులందర్నీ మళ్లీ ఆఫీసులకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ చెప్తున్నారు. అయితే బలవంతంగా ఈ పని జరగబోదన్నారు. ఉద్యోగులను బలవంతంగా వెంటనే ఆఫీసులకు రప్పించే కార్యక్రమం ఏదీ లేదని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ డెవలప్మెంట్ విభాగం అధిపతి, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి శంకర్ కూడా ఓ ఈ-మెయిల్ ద్వారా తాజాగా స్పష్టం చేశారు. కరోనా ప్రభావం నేపథ్యంలో గడిచిన రెండున్నరేండ్లకుపైగా ఐటీ ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తున్నది విదితమే. అయితే వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వీరందరూ తిరిగి ఆఫీసుల నుంచి పనిచేసేలా ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
No comments:
Post a Comment