ప్రైవేటు వాహనంలో ఈవిఎంల తరలింపు : సిబ్బంది సస్పెండ్

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్ అనంతరం ఓ పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవిఎంలను ప్రైవేటు వాహనంలో తరలించడం సంచలనమైంది. దీనిపై కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో జిల్లా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఈవిఎంలను ప్రైవేటు వాహనంలో తరలించిన సిబ్బందిని ఆదివారంనాడు సస్పెండ్ చేసింది. రామ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని దత్‌నగర్-49 పోలింగ్ కేంద్రానికి కేటాయించిన పోలింగ్ పార్టీ నంబర్ 146 సిబ్బంది ఈవిఎం, వివిపాట్లను ప్రైవేటు వాహనంలో తీసుకువెళ్తున్నట్టు గమనించిన కాంగ్రెస్ వర్కర్లు ఆ విషయాన్ని వెంటనే ఈసి దృష్టికి తీసుకువెళ్లారు. బిజెపికి అనుకూలంగా ట్యాంపరింగ్ చేసేందుకు ఈవిఎంలను ప్రైవేటు వాహనంలో తరలించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఈవిఎం/వివిపాట్ మిషన్లను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ బయట బిజెపి, కాంగ్రెస్ నేతల సమక్షంలో ఈవిఎంలను బయటకు తీశారు. వాటికి వేసిన సీల్స్ సరిగానే ఉన్నాయని, ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని వెల్లడించారు. ఈవిఎంలను త్వరగా అప్పగించి తమ బాధ్యతలు పూర్తిచేసుకోవాలనే ఉద్దేశంతోనే సిబ్బంది వాటిని ప్రైవేటు వాహనంలో తీసుకువచ్చారని అధికారులు అన్నారు. ప్రైవేటు వాహనంలో ఈవిఎంలను తరలించడం ఈసిఐ ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుందని, ప్రాథమిక సమాచారం మేరకు ఈసిఐ ఆదేశాల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించి సబంధిత పోలింగ్ పార్టీ నెంబర్.146 సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు రిటర్నింగ్ అధికారి (ఎస్‌డిఎం) సురేందర్ మోహన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)