కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పాదయాత్ర సోమవారం ప్రారంభమైంది. పోచకట్టె నుంచి ఉదయం 6.30 గంటలకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 11 కిలో మీటర్లు సాగిన యాత్ర హులియార్ సమీపంలోని కెంకెర బసవనగుడికి చేరుకుంది. వర్షంలో తడుస్తూనే రాహుల్ గాంధీ అడుగులు ముందుకేశారు. యాత్రలో భాగంగా కాసేపు రాహుల్ గాంధీ పరుగులు పెట్టారు. ఆయనను అనుసరించేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇబ్బంది పడ్డారు. శివకుమార్ చేయి పట్టుకుని రాహుల్ గాంధీ పరుగెత్తారు. భద్రతా సిబ్బంది సహా కాంగ్రెస్ నేతలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. హులియూర్ నుంచి అటవీ ప్రాంతం కావడంతో 38 కిలోమీటర్లు రాహుల్తో పాటు యాత్ర చేసేవారంతా వాహనాల్లో వెళ్లారు. హిరియూర్లో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మృతికి సంతాపం తెలిపారు. ములాయం చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. ఆయన రాజకీయంగా ఎదిగిన వైనం, ప్రజలకు చేసిన సేవలను స్మరించారు. హిరియూర్ నుంచి సాయంత్రం యాత్ర సాగగా జోరువానలోను ఏమాత్రం ఆపకుండా రాహుల్ ముందుకు నడిచారు. రాత్రికి హర్తికోట గ్రామానికి యాత్ర చేరింది. రాష్ట్ర పార్టీ నేతలపై అసంతృప్తితో అసమ్మతి నేతగా మారిన కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీ అగ్రనేతలు దిగ్విజయ్సింగ్, కేసీ వేణుగోపాల్, రణదీప్సింగ్ సూర్జేవాలా సహా సిద్దరామయ్య, డీకే శివకుమార్, టీబీ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
వర్షంలోనూ భారత్ జోడో యాత్ర !
October 11, 2022
0
Tags