హైదరాబాద్ నగరంలో వరుసగా మూడో రోజు ముసురు కొనసాగుతోంది. మూడు రోజులుగా గ్రేటర్ పరిధిలో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. గత రెండు రోజుల్లో నగర వ్యాప్తంగా సగటున 8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలోని మాన్సూన్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు కరుస్తున్నాయని, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల సహాయం కొరకు 040-21111111 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్నారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించాలని.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తలసాని ఆదేశించారు.
హైదరాబాద్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
July 10, 2022
0
Tags