దేశంలో త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు లభిస్తుంది. ఆమెకు ఎన్డీఏలోని పార్టీలే కాకుండా ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇప్పటికే ద్రౌపది ముర్ము మూడింట రెండు వంతుల మెజార్టీకి చేరువయ్యారు. ఆమెకు ఒడిశాలోని బీజేడీ, ఏపీలోని వైసీపీ, టీడీపీ, ఉత్తరప్రదేశ్లోని బీఎస్పీ, తమిళనాడులోని ఏఐఏడీఎంకే, కర్ణాటకలోని జేడీఎస్, పంజాబ్లోని అకాలీ దళ్, మహారాష్ట్రలోని శివసేన, ఝార్ఖండ్లోని జేఎంఎం మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ము బలం 61 శాతానికి చేరింది. ఆమె నామినేషన్ వేసిన సమయంలో ఈ మద్దతు 50 శాతంగానే ఉంది. ఇప్పుడు ఆమె మొత్తం ఓట్ల విలువ 6.67 లక్షలుగా ఉన్నట్లు అంచనా. రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం ఓట్ల విలువ 10,86,431గా ఉంది. బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల ఎంపీల ఓట్ల విలువ మొత్తం 3.08 లక్షలు ఉంటుంది. బీజేడీ ఓట్ల విలువ దాదాపు 32,000, ఏఐఏడీఎంకే 17,200, వైఎస్సార్సీపీ దాదాపు 44,000, టీడీపీ 6,500, శివసేన 25,000, జేడీఎస్ 5,600 ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నిక ఈ నెల 18న జరుగుతుంది. వాటి ఫలితాలు జూలై 21న వెల్లడవుతాయి.
మూడింట రెండు వంతుల మెజార్టీకి చేరువలో ద్రౌపది ముర్ము
July 15, 2022
0
Tags