వ్యాక్సినేషన్ ప్రారంభించిన 18 నెలల్లోనే భారత్ ఈ ఘనతను సాధించింది. ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ అభినందనలు తెలిపారు '200 కోట్ల వ్యాక్సిన్ డోసుల వ్యాక్సిన్లను వినియోగించి మరో మైలురాయిని చేరినందుకు ప్రధాని మోదీకి అభినందనలు. భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మేము భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాం. దానితో పాటు కరోనా ప్రభావాన్ని తగ్గిస్తున్నందుకు కృతజ్ఞతలు' అని బిల్గేట్స్ ట్వీట్ చేశారు. భారత్లో కరోనా వ్యాక్సిన్ డోసుల వినియోగం సంఖ్య 200 కోట్లు దాటడంతో ఇప్పటికే పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ కూడా ఆదివారం స్పందిస్తూ భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 75 రోజుల పాటు ఉచితంగా బూస్టర్ డోసులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. కాగా, దేశంలో గత ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 100 కోట్ల డోసులను వేయడానికి కేవలం 9 నెలల సమయం పట్టింది. అలాగే, మరో 9 నెలల్లో 200 కోట్ల డోసులను వేశారు. తెలుగు రాష్ట్రాల్లో12 ఏళ్ళ పైబడిన వారిలో అర్హులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.
ప్రధానికి బిల్ గేట్స్ అభినందనలు
July 20, 2022
0
Tags