4 కోట్ల మంది ఒక్క డోస్ కూడా తీసుకోలేదు

Telugu Lo Computer
0


కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పంపిణి విస్తృత స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జులై 18 నాటికి 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఒక్క డోస్ కూడా తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలోని వయోజన జనాభాలో 98శాతం మంది కనీసం ఒక డోస్‌ని పొందారని.. జులై 18 వరకు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మొత్తం 1,78,38,52,566 వ్యాక్సిన్ డోసులు (97.34 శాతం) ఉచితంగా అందించినట్లు ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు ఎంతమంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదో చెప్పాలని పలువురు సభ్యులు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు 60ఏళ్ల వయసుపైబడిన వారికి బూస్టర్ డోసు పంపిణీని ఈ ఏడాది మార్చిలోనే ప్రారంభించామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ క్రమంలో 18 నుంచి 59ఏళ్ల వారికి జులై 15 నుంచి ఉచితంగానే పంపిణీ మొదలు పెట్టామన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ విస్తృత పంపిణీ కార్యక్రమాన్ని 75 రోజులపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలోని వయోజన జనాభాలో 98 శాతం మంది కొవిడ్-19 వ్యాక్సిన్‌లో కనీసం ఒక డోస్‌ను పొందగా.. 90 శాతం మంది పూర్తిగా రెండు డోసులను తీసుకున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో సుమారు 10-20 శాతం మంది దీర్ఘకాలం పాటు వ్యాధి లక్షణాలు వేధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వివరించారు. అందులో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి, నిద్ర సమస్యలు, దగ్గు, ఛాతి నొప్పి, నరాలు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, ఆందోళన, జ్వరం వంటి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేశామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)