తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వాతావరణం కొంత చల్లబడింది. విపరీతమైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోత నుంచి నిన్న కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. మరో రెండు మూడు రోజులపాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రైతులు మాత్రం చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలతోపాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకూడదని తెలిపింది. తెలంగాణలో కూడా రెండు మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో నగర ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు !
May 05, 2022
0
Tags