చెల్లిని ఎత్తుకుని స్కూల్‌కి వెళ్లిన బాలిక

Telugu Lo Computer
0


లేలేత పాదాలతో లేడి పిల్లలా గంతులేసే పదేళ్ల పసిప్రాయం తనది. తోటివారితో ఆడుతూ ప్రపంచాన్నే మరచిపోయే వయసు తనది. కానీ తన చిట్టి చెల్లి కోసం అమ్మలా బాధ్యత తీసుకుంది. రెండేళ్ల వయసున్న చెల్లెమ్మను చంకన వేసుకుని బడికి వెళ్లింది. చెల్లాయిని ఒల్లో కూర్చొబెట్టుకుని శ్రద్ధగా పాఠాలు విన్నది. ఓ వైపు చెల్లెమ్మను లాలిస్తూనే మరోపక్క పాఠాలు ఆలపించిన తీరు అక్కడి ఉపాధ్యాయులకు ముచ్చట గొల్పింది. ముద్దొచ్చే మణిపూర్ బాలిక మెనింగ్‌సిన్‌లియు పమేయ్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ ఫొటోలు మణిపూర్ మంత్రి  బిశ్వజిత్ తొంగమ్ వరకూ చేరాయి. 10 ఏళ్ల చిరుప్రాయంలోనే బాలిక అంకితభావాన్ని చూసిన మంత్రి మురిసిపోయారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో చూసిన తర్వాత బాలిక కుటుంబం ఎక్కడ ఉంటుందో వెంటనే కనుక్కున్నారు. బాలికను రాజధాని ఇంఫాల్ తీసుకురావాలని, తన కోసం బోర్డింగ్ స్కూల్ సిద్ధంగా ఉందని కుటుంబ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు బాధ్యతంతా తనదేనని ఆయన హామీ ఇచ్చారు. బాలిక చదువు కోసం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని భరోసా ఇచ్చారు. బాలిక అంకిత భావానికి గర్వపడుతున్నానని అన్నారు. బాలిక భవిష్యత్ ప్రయత్నాలకు మీరు కూడా అభినందనలు తెలిపాలంటూ ట్వీట్ చేశారు. ఇంఫాల్‌లోని స్లొపెలాండ్ పబ్లిక్ స్కూల్లో బోర్డింగ్ స్కూలింగ్‌ బాలిక కోసం సిద్ధంగా ఉందన్నారు. బాలిక చక్కటి విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. దీంతో మణిపూర్ మంత్రిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దయాగుణాన్ని చాటుకున్నారని నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. గొప్పపని చేశారంటూ తెగపొగిడేస్తున్నారు. పేద బాలిక పట్ల దయ చూపారని ప్రశంసించారు. కాగా 10 ఏళ్ల బాలిక మెనింగ్‌ సిన్లియూ పమేయ్ ప్రస్తుతం మణిపూర్‌లో తమెన్‌గ్లాంగ్ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)