ఐసీజేలో రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత జడ్జి

Telugu Lo Computer
0


ఉక్రెయిన్​పై దురాక్రమణ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో భారతీయ జడ్జి సైతం రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఉక్రెయిన్​పై దండయాత్రకు వ్యతిరేకంగా ఐసీజే తీర్పు చెప్పగా భారత్​ నుంచి న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ అందులో భాగమయ్యారు. సైనిక చర్యను నిలిపివేయాలని ఉక్రెయిన్ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన 15 మంది న్యాయమూర్తుల్లో 13మంది రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇద్దరు పిటిషన్​ను వ్యతిరేకించారు. ఉక్రెయిన్ ఫిర్యాదును తోసిపుచ్చిన వారిలో రష్యా న్యాయమూర్తి, ఐసీజే ఉపాధ్యక్షుడు కిరిల్ గెవోర్జియన్, చైనా న్యాయమూర్తి షూ హాన్​కిన్​ ఉన్నారు. తక్షణమే రష్యా దళాలు తమ దాడులను నిలిపివేయాలని ఐసీజే బుధవారం ఆదేశాలిచ్చింది. 1948 జెనోసైడ్‌ కన్వెన్షన్‌ను రష్యా ఉల్లంఘించిందని పేర్కొంది. ఫిబ్రవరి 24న రష్యా సమాఖ్య ప్రారంభించిన సైనిక చర్యను నిలిపివేయాలంటూ తీర్పిచ్చింది. ఈ తీర్పును అమెరికా స్వాగతించింది. రష్యా వెంటనే సైనిక చర్య నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఐసేజీ తీర్పు స్పష్టంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ఈ తీర్పునకు పుతిన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా లేదా అన్నది అనుమానమే. ఈ విచారణకు రష్యా హాజరు కాలేదు. తర్వాత లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని వాదించింది. దీన్ని రష్యా అమలుచేయకపోతే.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అంతర్జాతీయ న్యాయస్థానం నివేదిస్తుంది. మండలిలో రష్యాకు వీటో అధికారం ఉన్న నేపథ్యంలో తీర్పు అమలు ప్రశ్నార్థకమేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)