ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బదిలీల్లో భాగంగా సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. ఆయన సీఎంవోలో నియమితులైనప్పటికీ, టీటీడీ ఈవోగానూ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులు కాగా సీసీఎల్ఏగా జి.సాయిప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ బదిలీ అయ్యారు. అలాగే రవాణా శాఖ కమిషనర్ గా ఎం టీ కృష్ణబాబు, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాబు, క్రీడలు యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ అధికారులతో పాటే ముగ్గురు ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంటెలిజెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు నియమితులయ్యారు. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ ఓపీఎఫ్ బాధ్యతలను కూడా ఆయనే చూసూకుంటారని ప్రభుత్వం పేర్కొంది . మరో సీనియర్ ఐపీఎస్ అధికారి భరత్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి
February 23, 2022
0
Tags