పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను యూసుఫ్గూడలోని పోలీస్ లైన్స్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. మైత్రివనం నుంచి యూసఫ్గూడ వైపు వచ్చే వాహనాలు, జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి యూసఫ్గూడ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నామని వెల్లడించారు. దీంతో వాహనదారులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా జారీ చేసిన పాస్లు ఉన్నవారు మాత్రమే ప్రీ రిలీజ్ వేడుకకు రావాలని, పాస్లు లేని వారు రావద్దన్నారు. ఈ నెల 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి లేదని, నేటి తేదీతో ఉన్న పాసులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 5 నుంచి యూసుఫ్గూడ చెక్పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను కమలాపురి కాలనీ, శ్రీనగర్ కాలనీ మీదుగా మళ్లిస్తారు. అమీర్పేట మైత్రీవనం నుంచి యూసుఫ్గూడ చెక్పోస్ట్ మీదుగా ట్రాఫిక్ను అనుమతించరు. ఆ ట్రాఫిక్ను కమలాపురి కాలనీ, ఇందిరానగర్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 5వైపు మళ్లిస్తారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ సమీపంలోని సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియం పార్కింగ్, యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ కి అవకాశం కల్పించారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
February 23, 2022
0
Tags