వీడిన సుప్రియ మర్డర్ మిస్టరీ

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ముంబై లోని డొంబివిలో గత మంగళవారం జరిగిన సుప్రియ అనే వివాహిత మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె భర్త క్లోజ్ ఫ్రెండ్, పక్క ఇంట్లో ఉండే విశాల్ గెహావత్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ముంబైలోని మాన్‌పాడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని శివశక్తి నగర్, ఓం రెసెడెన్సీలో కిషోర్ షిండే భార్య సుప్రియ (33) కుమారుడు శ్లోక్ (10) తో నివసిస్తున్నాడు. వారి ఇంటికి సమీపంలోనే అతని స్నేహితుడు విశాల్ గెహవత్ భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. విశాల్ కిషోర్ భార్య సుప్రియపై కన్నేశాడు. స్నేహితుడిని కలిసే నెపంతో వారి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడేవాడు. అతని దురుద్దేశ్యాన్ని ఎవరూ గుర్తించలేక పోయారు. సుప్రియకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. దాన్ని ఆసరాగా తీసుకుని మిత్రుడులేని సమయంలోనూ, రాత్రి సమయాల్లోనూ వారి ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమెతో చనువుగా ఉండటానికి ప్రయత్నించేవాడు. అయితే ఆమె అతడ్ని.. అతడి ప్రవర్తనను పెద్దగా పట్టించుకోలేదు. అతనిలోని క్రూరత్వాన్ని గుర్తించలేకపోయింది. సోమవారం రాత్రి కూడా పుస్తకాలు ఇవ్వటంకోసం విశాల్ వారి ఇంటికి వెళ్లివచ్చినట్లు భర్త కిషోర్ తెలిపాడు. మంగళవారం ఉదయం 9-30 గంటల సమయంలో భర్త కిషోర్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కుమారుడు శ్లోక్ స్కూలు కు వెళ్లాడు. మద్యాహ్నం సమయంలో విశాల్ ఆమె ఇంటికి వెళ్లాడు. పుస్తకం కావాలని సుప్రియతో మాటలు కలిపాడు. ఈక్రమంలో తన మనసులో కోరిక బయటపెట్టాడు. ఆమె షాక్ కు గురైంది. భర్త స్నేహితుడికి తనపై అలాంటి అభిప్రాయం ఉండటంతో నివ్వెరపోయింది. వెంటనే తేరుకుని అతడి చెంప చెళ్లుమనిపించింది. దీంతో రెచ్చిపోయిన విశాల్ ఆమెపై బలాత్కారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించే సరికి తల నేలకేసి బాది స్పృహతప్పేట్టు చేశాడు. అనంతరం నైలాన్ తాడును సుప్రియ మెడకు బిగించి హత్యచేశాడు. సుప్రియ శవాన్ని ఇంట్లోని సోఫా కమ్ బెడ్ లో కుక్కి దానిని మాముులుగా సర్దేసి, దానిపై దుప్పటి కప్పేసిఇంటికి లోపలి వైపు నుంచి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం గం.5-30 అయినా స్కూలులోని శ్లోక్ ను తీసుకువెళ్లటానికి సుప్రియ రాకపోవటంతో స్కూలు యాజమాన్యం కిషోర్ కు ఫోన్ చేసింది. కిషోర్ సుప్రియకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాలేదు. దీంతో స్కూలుకు వెళ్లి కుమారుడ్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు కిషోర్. ఈలోపు బంధువులకు సుప్రియ కనపడటంలేదనే సమాచారం ఇచ్చాడు. తన స్నేహితుడు విశాల్ కు కూడా సమాచారం ఇచ్చాడు. అందరూ కలిసి సుప్రియ కోసం వెతకటం ప్రారంభించారు. కిషోర్, విశాల్ కలిసి మాన్‌పాడ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి సుప్రియ కనపడటంలేదని ఫిర్యాదు చేసి వచ్చారు. అందరూ సుప్రియ కోసం వెతుకుతున్నప్పుడూ కిషోర్ పక్కనే ఉన్నాడు విశాల్. ఈ క్రమంలో ఒకరు ఇంట్లో ఉన్న సోఫా కుషన్ చిరిగి ఉండటం గమనించారు. అది పైకి ఎత్తిచూడగా అందులో సుప్రియ షిండే మృతదేహాం బయట పడింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. కిషోర్ ఇంటి సమీపంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవటంతో నిందితుడిని గుర్తించటం పోలీసులకు కొంత కష్టం అయ్యింది. ఇరుగుపొరుగు వారి సహకారంతో పోలీసులు కేసును చేధించారు. ఘటన జరిగిన మంగళవారం మధ్యాహ్నం విశాల్ చెప్పులు సుప్రియ ఇంటి బయట ఉండటం పక్క ఇంటి మహిళ చూసింది. ఆ విషయాన్ని పోలీసులకు వివరించింది. కొన్నిసార్లు రాత్రి పూట కూడా విశాల్ వారి ఇంటికి వచ్చివెళ్లటాన్ని పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు విశాల్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో నిందితుడు నేరం ఒప్పుకున్నాడని డీసీపీ సచిన్ గుంజాల్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)