అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సోదాల్లో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జమ్ము వెంకట వరప్రసాదరావు అక్రమాస్తుల చిట్టా బహిర్గతమైంది. విశాఖపట్నానికి చెందిన వరప్రసాదరావు తండ్రి పిఠాపురంలో సబ్రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తూ.. 1982లో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకం ద్వారా వరప్రసాదరావుకు ఆ శాఖలో 1989లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందారు. అనంతరం 1996లో సీనియర్ అసిస్టెంట్గా, 2008లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా పదోన్నతి పొందారు. 2009-10లో ఆత్రేయపురంలో పనిచేసిన ఆయన.. ఆపై కొత్తపేట, పిడింగొయ్యి కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జులై నుంచి ఆత్రేయపురం జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా విధులు కొనసాగిస్తున్నారు. ఈసీలు, పాస్ పుస్తకాలు ఆన్లైన్ చేయడం, సరిహద్దు వివాదం.. ఇలాంటి అంశాలను కొలిక్కి తేవడానికి వరప్రసాదరావు తనదైన శైలిలో వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రైతులు అతడి అవినీతితో విసిగి నాలుగు నెలల కిందట అనిశాకు ఫిర్యాదు చేశారు. దీంతో అనిశా అధికారులు వరప్రసాదరావుపై నిఘా ఉంచారు. రాజమహేంద్రవరంలోని వరప్రసాదరావు ఇల్లు, స్థానికంగా ఉన్న ఓ బంధువు ఇల్లు, అతడు విధులు నిర్వహిస్తున్న కార్యాలయం, కాకినాడలో ఆయన భార్య ఉండే ఇల్లు, విజయవాడ సమీపంలోని గుణదల, తెలంగాణలోని మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో అతడి కుటుంబం, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో అనిశా అధికారులు సోదాలు జరిపి.. రూ.1.4 కోట్ల అవినీతి సొమ్ము ఉన్నట్లు తేల్చారు.
వెలుగులోకి సబ్రిజిస్ట్రార్ అక్రమాస్తులు
December 08, 2021
0
Tags