వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిక్కు ఇంద్ర స్థానం, కుబేర స్థానం. అందుకే నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిదని చెబుతారు. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. అందుకే దేవతలుండేవైపు తలబెట్టి పడుకుంటే వారి అనుగ్రహం కలుగుతుందంటారు. ఈ దిక్కువైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందట. ఇక పడమర దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్లు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది కాబట్టి ఈ దిశగా కాళ్లు పెట్టడం దోషం అంటారు. దక్షిణం ఇది యమ స్థానం. దక్షిణ దిక్కు యమునికి చెందిన దిక్కు కాబట్టి అటు వైపు కాళ్ళు కాకుండా తలపెట్టుకోవాలని చెబుతారు. ఆరోగ్యానికి, ఆయుష్షుకి చాలా మంచిదని చెబుతారు. ఉత్తరం దిక్కుకి అధిపతి కుబేరుడు కానీ మనుషులు ఆ దిక్కుగా తల పెట్టుకోరాదు. ఎందుకంటే కేవలం శవాన్ని మాత్రమే ఉత్తరం వైపునకు పెడతారు. మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెడితే దక్షిణ దిశ యముడి స్థానం కావడంతో చావుకి ఎదురెళ్లినట్టే అంటారు వాస్తు నిపుణులు. ఈ దిశలో నిద్రపోవడం వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉండటమే కాదు మనస్సు కూడా నియంత్రణలో ఉండదంటారు. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ పడమటి నుంచి తూర్పువైపు పయనిస్తుంటాయి. అందుకే తూర్పు, దక్షిణం వైపు శిరస్సుంచి పడుకోవడం మంచిదంటారు.
సైన్స్ ప్రకారం మనదేశం ఉత్తరార్ధ గోళంలో ఉండడం వలన సైన్ ప్రకారం అయస్కాంత తరంగాలు ఉత్తరంవైపు నుంచి పడమర మీదుగా దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులోని శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు రావడమే కాక, రక్తప్రసరణలో మార్పు వస్తుందంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇలా చేస్తే వారిలో పెద్దగా ప్రమాదం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ వాళ్లు కూడా నిద్రలేస్తూనే ఆందోళనగా కనిపిస్తారు. పెద్దలు మాత్రం చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం తప్పదంటారు. మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే తలనొప్పి, గందరగోళం, మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు.