వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు!

Telugu Lo Computer
0


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్ను అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ముంబయిలోని ఆయన నివాసంతోపాటు.. నాగ్‌పూర్‌, జైపుర్‌లలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భారీ మొత్తంలో పన్ను ఎగవేతను అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలీవుడ్‌ నుంచి తీసుకున్న పేమెంట్లు, సోనూ వ్యక్తిగత ఆదాయంలో ఈ పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలుస్తోంది. సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఐటీ అధికారులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశముంది. పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ''లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్‌ నిర్వహించాం'' అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. నిన్న మరోసారి సోనూ నివాసానికి వెళ్లిన అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా స్థిరాస్తి సంస్థతో ఒప్పందం గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ 'ఆప్‌' ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. సోనూ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొవిడ్‌ వేళ వలస కూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)