మళ్లీ బీజేపీదే అధికారం: జేపీ నడ్డా

Telugu Lo Computer
0


వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీదే అధికారమని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తాము చేయించిన అన్ని సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీనే ఆశీర్వదించనున్నారని నడ్డా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బూత్ విజయ్ అభియాన్ ప్రారంభించిన సందర్భంగా నడ్డా ప్రసంగించారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ అదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ చారిత్రక విజయం సాధించిందని జేపీ నడ్డా చెప్పారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా యూపీ ప్రజలు అభివృద్ధి రాజకీయాలకు మద్దతుగా నిలిచారన్నారు. యూపీలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇక్కడి పార్టీ కార్యకర్తల ఉత్సాహమే సంకేతమని చెప్పారు. మోదీ హయాంలో కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, మత రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు మంటగలిసి పోయాయని నడ్డా వ్యాఖ్యానించారు. పేరు ప్రస్తావించకుండానే కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీపై జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. మన దగ్గర పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా విడిది కోసం విదేశాలకు వెళ్లే నాయకులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయని, క్వారెంటైన్‌లో ఉన్నాయని అన్నారు. బీజేపీ కార్యకర్తలు మాత్రమే ప్రాణాలకు తెగించి ప్రజలకు సాయం చేశారని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)