అద్దేపల్లి రామమోహన రావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. రామమోహన రావు కాకినాడ నివాసి. ఆవంత్స సోమసుందర్ శివ సాగర్, చెరబండరాజు, నగ్నముని, కె.శివారెడ్డి వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చారు. తెలుగులో మినీ కవితా ప్రక్రియను చేపట్టిన కవుల్లో అద్దేపల్లి ఒకరు. రామమోహనరావు 1936, సెప్టెంబరు 6న బందరు శివార్లలోని చింతగుంటపాలెంలో పుట్టారు. చింతగుంటపాలెంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు నాలుగు కిలోమీటర్లు దూరం ఉన్న జవారుపేట హిందూ హైస్కూల్లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు బందరు హిందూ కాలేజీలో గుమాస్తాగా పనిచేసేవారు. ఈయన కవులు, పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ కుటుంబంలో పెరిగి పెద్దవాడయ్యారు.సతీమణి అన్నపూర్ణ. సంతానం నలుగురు మగపిల్లలు. ఈయన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతినుండి ఎం.ఏ.పూర్తి చేసి బందరు హిందూకాలేజీలో కొంతకాలం ట్యూటర్గాను, లెక్చరర్గాను పనిచేశారు. తరువాత కొంతకాలం నందిగామలో ఉద్యోగం చేసి 1972లో కాకినాడ వచ్చారు. ప్రస్తుతం కాకినాడలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 13వ తేదీ జనవరి నెల 2016 న అస్తమించారు. ఆయన మరణం సాహిత్య లోకానికీ విమర్శనాపరిశీలనలకు తీరని లోటు.రచనలు
మధుజ్వాల
అంతర్జ్వాల
గోదావరి నా ప్రతిబింబం
రక్తసంధ్య
సంఘం శరణం గచ్ఛామి
మెరుపు పువ్వు
అయినాధైర్యంగానే
పొగచూరిన ఆకాశం
శ్రీశ్రీ కవితాప్రస్థానం
విమర్శ వేదిక సాహిత్య సమీక్ష
జాషువా కవితా సమీక్ష
కుందుర్తి కవిత
మినీకవిత
దృష్టిపథం
స్త్రీవాద కవిత్వం
అభ్యుదయ విప్లవ కవిత్వాలు - సిద్ధాంతాలు, శిల్పరీతులు
గీటురాయి
విలోకనం
కాలంమీద సంతకం
తెరలు
ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళ
ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల
తెలుగు కవిత్వంలో ఆధునికత
అల్లూరి సీతారామరాజు (వచన కవితా కధా కావ్యం)
పొగచూరిన ఆకాశం (కవితా సంపుటి)
అద్దేపల్లి రామమోహనరావు కవితా సంపుటి పొగచూరిన ఆకాశం కవితా సంపుటి "చిన్నప్ప" అవార్డుకు ఎంపిక అయింది.ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా ఆయనే వ్యవహరించడం ఒక విశేషం. "పొగచూరిన ఆకాశం" లో అద్దేపల్లి ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద ఆధిపత్య పోకడలను, దేశంపై రాజకీయ ఆర్థిక దుష్ప్రభావాలను సాంస్కృతిక కాలుష్యాన్ని ప్రతిభావంతంగా అక్షరీకరించినందుకు తన పుస్తకాన్ని తానే ఎంపిక చేసుకున్నానని చెప్పారు. మారుతున్న కాలాన్ని ప్రతిబింబించే పదబంధాలు, విప్లవాత్మక చిత్రణ ఇందులో చూడగలుగుతాము. ప్రధానంగా ఈ కవితా సంపుటితో పాటు అద్దేపల్లి నిరంతర సాహితీ కృషిని కూడా గౌరవించాలి.