టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఆయన వరుసగా పార్టీ పెద్దలను కలుస్తున్నారు. సోమవారం పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పార్టీ విషయాలను చర్చించారు. అనంతరం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీ హనుమంత రావును పరామర్శించారు. రేవంత్ ని చూడగానే వీహెచ్ చిరునవ్వు నవ్వారు. ఇదే సమయంలో వీహెచ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు రేవంత్. పరామర్శ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.. వీహెచ్ ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆరోగ్యం పరిస్థితి సరిగా లేకపోయిన తనతో ప్రజా సమస్యలపై మాట్లాడారని వివరించారు. దళితుల తరపున పోరాటం చేయాలనీ వీహెచ్ తెలిపినట్లు రేవంత్ వివరించారు. దళితుల అభివృద్ధికి కృషి చేసేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత తమపైనే ఉందని హనుమంతరావు గుర్తు చేశాడని తెలిపారు రేవంత్. కాగా వీహెచ్, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.