యువతి ప్రతిఘటన !
June 06, 2021
0
విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో టైపిస్టుగా పని చేసే లక్ష్మి అపర్ణ డ్యూటీకి ఉదయం ఆటోలో వెళ్తుంటారు. సాయంత్రం ఆమె సోదరుడుగానీ, స్నేహితుడు గానీ వచ్చి తీసుకెళ్తుంటారు. కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి కావాల్సిన పత్రాలు అన్ని ఆమె వద్ద ఉన్నాయి. శనివారం సాయంత్రం స్నేహితుని బండిపై ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో వారి వద్ద కావాల్సిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు బండి ఫోటో తీసి, అపరాధ రుసుం వివరాలను సెల్ కి పంపారు. సెల్ కి వచ్చిన ఎస్సెమ్మెస్ ను గమనించి, వెనక్కి తిరిగి వచ్చి అన్ని పత్రాలు ఉన్నా అపరాధ రుసుం ఎందుకు వేశారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అది పెద్ద అవ్వడంతో ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. వీలిపడకపోవడంతో సెల్ ని లాక్కున్నారు. దీనితో ఆమె తిరగబడడం, మహిళా పోలీసులు నిలువరించడంతో తోపులాట జరిగింది. బలవంతంగా ఆమెను పోలీసులు వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు. తానూ తప్పు చెయ్యనప్పుడు ఎందుకు రావాలంటూ రోడ్డుపై పడుకున్నారు. ప్రతి రోజూ జరిమానా విధిస్తే తన జీతంతా అవి చెల్లించడానికే సరిపోతుందని అపర్ణ కన్నీరుమున్నీరయ్యారు. స్టేషన్ కి రానని తేల్చి చెప్పడంతో పోలీసులు వెనుతిరిగారు. ఇదిలా ఉండగా పోలీసుల విధులకు ఆటంకపరిచినందుకు, మహిళా హోంగార్డ్ ను గాయపర్చినందుకు లక్ష్మి అపర్ణ, ఆమె స్నేహితుడు రాజ్ కుమార్ పై సెక్షన్ 352, 353 కింద కేసు నమోదు చేశామని విశాఖ తూర్పు ఏసిపి హర్షిత్ చంద్ర తెలిపారు. లక్ష్మి అపర్నే పోలీసుల వద్దకు వచ్చి గొడవ పడిందని చెప్పారు.