ఇండియన్ రైల్వే, ఐఆర్‌సీటీసీ కలిసి రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ !

Telugu Lo Computer
0


వేసవి కాలం, విద్యార్థులకు సెలవులు లభిస్తుండటంతో చాలా మంది దూర ప్రయాణాలు, తీర్థ యాత్రలకు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. దాంతో రైళ్లల్లో భారీగా రద్దీ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారం అందించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. ఇంతక్రితం  ఇండియన్ రైల్వే, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ను తీసుకువచ్చాయి. ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ఉద్దేశంతోనే రైల్వే శాఖ ఈ ఎకానమీ మీల్స్ తీసుకు వచ్చింది. జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం సరసమైన ధరలో భోజనం అందించేందుకు ఈ విధానం తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా వందకుపైగా రైల్వే స్టేషన్లలో 150 కేంద్రాల ద్వారా ఈ ఎకానమీ మీల్స్‌ పథకం ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట , గుంతకల్ , తిరుపతి , రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల రైల్వే స్టేషన్‌లలో 18 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్‌ను ప్రయాణికులకు అందించేందుకు రైల్వే శాఖ సిద్ధం అవుతుంది . ఎకానమీ మీల్స్‌లో భాగంగా రెండు రకాలైన భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి రకంలో కేవలం 20 రూపాయలకే ప్రయాణికులకు భోజనం అందించనున్నారు. ఇక రెండోరకంలో 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తారు. రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ ఎకానమీ భోజనం, నీటి ప్యాకెట్లను సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఆగే చోట ఫ్లాట్ ఫారమ్‌లపై అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులు ఈ కౌంటర్ల నుంచి నేరుగా ఈ ఎకానమీ మీల్స్‌ను కొనుగోలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలను గతేడాది 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మద్య రైల్వేలోని ఏడు స్టేషన్‌లలో ఐఆర్‌సీటీసీ కిచెన్‌ యూనిట్ల ద్వారా ఈ భోజనం అందిస్తున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)