మహారాష్ట్రలో శివసేన (యూబీటీ)కు చెందిన కొత్త ప్రచార గీతం వివాదంలో పడింది. అందులోని జైభవానీ, హిందూ అనే పదాలను తొలగించాలని సూచిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తమకు నోటీసులు పంపిందని పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. ఈసీ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ గీతం నుంచి ఆ పదాలను తొలగించడం మహారాష్ట్రకు అవమానకరమని పేర్కొన్నారు. ''తుల్జా భవానీ ఆశీస్సులతో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందవీ స్వరాజ్ను స్థాపించారు. మతం, భవానీ మాత పేర్ల మీద మేం ఓట్లు అడగటం లేదు. ఈ పదాలను తొలగించమనడం అవమానకరం. దీన్ని మేం సహించం'' అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ''ఒకవేళ మా మీద చర్యలు తీసుకోవాలనుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ 'బజరంగ్ బలీ' ప్రస్తావన తెచ్చినప్పుడు ఏం చేసిందో ఈసీ చెప్పాలి. అయోధ్య ఉచిత దర్శనం పేరిట అమిత్ షా ఓట్లడిగారు'' అని తెలిపారు. ప్రస్తుతం మతం పేరిట ఓట్లడుగుతున్నారని, ఈ విషయంలో నిబంధనలు ఏమైనా మారాయా? అని 'ఈసీ'ని ఉద్ధవ్ ప్రశ్నించారు. అటల్ బిహారీ వాజ్పేయీ హయాంలో హిందుత్వ ప్రచారం చేసినందుకు తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేను ఆరేళ్లపాటు ఎన్నికల్లో ఓటు వేయకుండా, పోటీ చేయకుండా నిషేధించారని గుర్తుచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్ షాలు మతాన్ని ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగాలు నిబంధనల ఉల్లంఘన అవునా? కాదా? అని స్పష్టం చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.
జైభవానీ, హిందూ అనే పదాలను తొలగించబోం : ఉద్ధవ్ ఠాక్రే
April 21, 2024
0
Tags