హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ''ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. రేవంత్రెడ్డిని దెబ్బతీయాలని భాజపా, భారాస ఏకమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాకు డీకే అరుణ ఏం చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆమె జాతీయ హోదా తీసురావచ్చు కదా ! కానీ, పార్టీలో మాత్రం జాతీయ పదవి తెచ్చుకున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత సంపత్కు కాంగ్రెస్లో మంచి పదవి వస్తుంది. వాల్మీకి, బోయలను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నికల కోడ్ ముగియగానే వాల్మీకి, బోయల డిమాండ్లు నెరవేరుస్తాం. గద్వాల్, అలంపూర్ ప్రాంతంలోని బోయల గురించి తెలుసు. ఇప్పుడు అందరూ ఒక వైపు రండి. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో మన పరిపాలనను అభినందిస్తున్నారు. ఎవరు ఏ సమస్యతో వచ్చినా వాటి పరిష్కారం కోసం పని చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి, భార్యాభర్తల మాటలు విన్నారు. ట్యాపింగ్ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ చేసిన వారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు. తగిన ఫలితం ఉంటుంది. ట్యాపింగ్పై విచారణ జరుగుతోంది. తప్పకుండా చర్యలు ఉంటాయి. అధికారులకు ఆ రోజే చెప్పా. వినలేదు. ఇవాళ జైలుకు వెళ్తే.. అటు వైపు చూడటం లేదు. ఓటు విలువ తెలుసు.. అందుకే దిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశా. లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి వంశీచంద్రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి'' అని సీఎం రేవంత్రెడ్డి కోరారు.
ట్యాపింగ్ చేసిన వారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది !
March 29, 2024
0
Tags