మధ్య ప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో తన కారును ఓవర్టేక్ చేసినందుకు ఇద్దరు యువకులను బాంధవ్గడ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దారుణంగా చితకబాదాడు. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎస్డీఎం అమిత్ సింగ్, తహసీల్దార్ వినోద్ కుమార్ వారి సహచరులతో కలిసి ప్రభుత్వ వాహనంలో వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనం ఓవర్టేక్ చేసింది. దీంతో వారి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఎస్డీఎం, తహసీల్దార్ వారి డ్రైవర్లతో కలిసి యువకుల వాహనం ఆపి కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఎస్డీఎం కర్రతో ఓ వ్యక్తిని కొట్టినట్లు కనిపిస్తోంది. అనంతరం వారు అక్కడినుంచి వెళ్లిపోగా, బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. బాధితులను శివం యాదవ్, ప్రకాష్ దహియాగా గుర్తించారు. అయితే దాడికి పాల్పడ్డ ఎస్డీఎం అమిత్ సింగ్, తహసీల్దార్ వినోద్ కుమార్, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కొత్వాలి పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేష్ చంద్ర మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. ఇద్దరు యువకులపై అధికారి దాడి చేయడం ఆందోళనకరం. సామాన్యులపై అమానవీయంగా ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వం సహించదని మండిపడ్డారు.
కారును ఓవర్టేక్ చేశారని యువకులను చితకబాదిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ !
January 23, 2024
0
Tags