క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం !

Telugu Lo Computer
0


శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించిన మూడు క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోద ముద్ర వేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లులు చట్టాలుగా మారాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లకు ప్రత్యామ్నాయంగా ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వీటిపై హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేయడంతో బిల్లులను కేంద్రం వెనక్కితీసుకుంది. తర్వాత బిల్లులను సవరించి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో సభ ముందుకు తెచ్చింది. ఈ బిల్లులను గతవారం పార్లమెంట్ ఆమోదించి పంపగా.. తాజాగా రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. కాగా, దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ మూడు చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి. ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. దోషులకు శిక్షలు విధించే విషయంలో మేజిస్ట్రేట్​లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్థుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు. అంతేగాక, రాజద్రోహాన్ని నేరాల నుంచి రద్దు చేశారు. బ్రిటిష్ పాలకుడిని సూచించే రాజద్రోహానికి బదులుగా దేశద్రోహం అనే పదాన్ని ఇందులో ఉపయోగించారు. 'రాజ్యానికి వ్యతిరేకంగా చేసే నేరాలు' పేరుతో కొత్త సెక్షన్‌​ను అమర్చారు. వేర్పాటు చర్యలు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాద కార్యకలాపాలు, సార్వభౌమాధికారం లేదా ఐక్యతకు విఘాతం కలిగించడం వంటి నేరాలను ఇందులో చేర్చారు. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జీవితఖైదు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధనను ఇందులో పొందుపర్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)