స్వలింగ సంపర్కుల వివాహాల చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంట్‌దే !

Telugu Lo Computer
0


స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఎల్‌జిబిటి క్యుఐఎ + వర్గానికి చెందిన వ్యక్తుల వివాహానికి సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పేర్కొంది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. అలాగే స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించవద్దని వారి హక్కులను కాపాడాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం … నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అయితే స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అపోహను వీడాలని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది. "ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం … స్వలింగ సంపర్క జంటలు చేసుకునే వివాహానికి ఎలాంటి గుర్తింపు లేదు. ఈ వివాహాలకు మేం హక్కులను కల్పించలేం. అది తమ ప్రాథమిక హక్కు అని స్వలింగ సంపర్కులు పేర్కొనకూడదు. ఈ వివాహాలను గుర్తించేలా చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంట్‌దే" అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)