తమ్ముడిని దారుణంగా చంపిన అన్న !

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ 40వ డివిజన్‌ ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందుల శ్రీనివాస్‌, శ్రీధర్‌, శ్రీకాంత్‌ ముగ్గురు అన్నదమ్ములు. తల్లిదండ్రులకు చెందిన ఇంటి స్థలాన్ని ముగ్గురు 94.16 గజాల చొప్పున పంచుకున్నారు. పెద్దవాడైన శ్రీనివాస్‌ మరణించారు. చిన్నవాడైన శ్రీకాంత్‌కు వచ్చిన వాటా విషయంలో గొడవపడిన అన్న శ్రీధర్‌, ఆ భూమి నీకు ఇవ్వనని, ఇక్కడుంటే చంపుతానని తీవ్రంగా కొట్టాడు. దాంతో శ్రీకాంత్‌ వరంగల్‌ నుంచి తల్లితో కలసి నిజామాబాద్‌కు వెళ్లి కూలి పని చేసుకుంటూ ఉంటున్నాడు. 2019లో అక్కడి అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలతో తనకు చెందిన ఇంటి స్థలాన్ని విక్రయించి ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలనుకున్నాడు. అదే విషయంపై నిజామాబాద్‌ నుంచి ఉర్సుకు వచ్చి తన వాటా స్థలాన్ని విక్రయించడానికి యత్నించగా సోదరుడు శ్రీధర్‌ ఎప్పటిలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈనెల 7న మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో సోదరుడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీధర్‌ను స్టేషన్‌ పిలిచి కౌన్సెలింగ్‌ ఇవ్వగా, తన సోదరుడు భూమి అమ్ముకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు. భూమిని అమ్మడానికి ఇబ్బందిలేదని నమ్మిన శ్రీకాంత్‌ భార్యతో కలసి వరంగల్‌కు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే ఇద్దరు కొనుగోలుదారులను వెంట తీసుకొని స్థలం వద్దకు వెళ్లగా, వెనక నుంచి వచ్చిన శ్రీధర్‌ తమ్ముడు శ్రీకాంత్‌ను కొట్టడంతో స్థలం చూసేందుకు వచ్చిన వారు పారిపోయారు. తర్వాత శ్రీకాంత్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి గాయపరిచి అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. తలుపు వద్ద బండరాయి అడ్డుగా పెట్టాడు. ఎలాగోలా శ్రీకాంత్‌ ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తగా, బజార్ లో అందరూ చూస్తుండగానే రాయితో కొట్టి హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీకాంత్‌ను కొడుతున్న స్థానికంగా ఉన్న వారెవ్వరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయారు. శ్రీధర్‌, అతని భార్యాపిల్లలు ఇల్లు వదిలి పారిపోయారు. సంఘటన స్థలానికి ఏసీపీ బోనాల కిషన్‌, మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్‌ చేరుకుని పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)