తెలంగాణలో టీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. కొండాపూర్ ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం నారాయణఖేడ్ మండలం దామరిగిద్ద తండాకు చెందిన మన్మోహన్ సింగ్ అలియాస్ మోహన్ (22) తన తల్లిదండ్రులతో కలిసి ఆరు సంవత్సరాల క్రితం కొండాపూర్ మండలంలోని గొల్లపల్లికి వలస వచ్చారు. అప్పటి నుంచి అదే గ్రామంలో కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన చాకలి సాయికుమార్ (20) కూడా రోజువారీ పనులు చేసేవాడు. శుక్రవారం సాయికుమార్, మోహన్లిద్దరూ అదే గ్రామంలో పనికి వెళ్లారు. సాయంత్రం ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మల్లెపల్లిలోని ఏటీఎంలో డబ్బుల విత్డ్రా చేయడానికి బయలుదేరారు. సంగారెడ్డి నుంచి మైతాబ్ఖాన్గూడకు వెళుతున్న ఆర్టీసీ బస్సును మల్లెపల్లి శివారు వద్ద వేగంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సాయికుమార్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం
March 11, 2023
0