వందే భారత్ రైళ్లు ప్రైవేట్‌పరం ?

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా పట్టాలెక్కిన అత్యాధునిక వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఇప్పటివరకు 10 రైళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది. సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ 140 శాతం ఆక్యుపెన్సీ రేషియోను రికార్డు చేసింది. ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫలితంగా వారి తాకిడి ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు. కొత్తగా 400 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రూపొందించడానికి అధికారులు టెండర్లను జారీ చేశారు. నాలుగు చొప్పున దేశీయ, విదేశీ కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ని జారీ చేశాయి. ఈ 400 రైళ్లల్లో సగం స్లీపర్ క్లాస్ కు చెందినవే. మిగిలిన 200.. చైర్ కార్ సర్వీసులు. స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు గరిష్ఠంగా 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కొత్త కోచ్ లను తయారు చేయడం, వాటి నిర్వహణ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయనుంది. ప్రస్తుతం చెన్నైలో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ కోచ్ లు తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ బాధ్యతల నుంచి ఐసీఎఫ్ ను తప్పించనుంది కేంద్రం. కొత్త కోచ్ ల తయారీ, వాటి నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. దీనికోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టింది. వందే భారత్ కోచ్ ల తయారీ, నిర్వహణ కోసం ఫ్రాన్స్ కు చెందిన అల్ స్టొమ్, భారత్-స్విట్జర్లాండ్ సంస్థ మేధా-స్టాడ్లర్ రైల్ కన్సార్టియం బిడ్స్ ను దాఖలు చేసింది. ఈ ఒక్క కన్సార్టియం మాత్రమే బిడ్స్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరే సంస్థ కూడా ముందుకు రాలేదు. స్టాడ్లర్ రైల్ కు అనుబంధంగా పని చేస్తోన్న హైదరాబాద్ కు చెందిన మీడియా సర్వో డ్రైవ్స్..ఈ కన్సార్టియంలో భాగస్వామిగా ఉంది. 35 సంవత్సరాల పాటు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అవసరమైన అల్యూమినియం కోచ్ లను ఈ కన్సార్టియం తయారు చేస్తుంది. అలాగే వాటి నిర్వహణ బాధ్యతలను కూడా ఈ కన్సార్టియమే చూసుకుంటుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 30,000 కోట్ల రూపాయలు. వంద రైళ్లకు మాత్రమే సరిపడ అల్యూమినియం కోచ్ లను తయారు చేస్తుందీ కంపెనీ. ఈ మేరకు టెక్నికల్ బిడ్స్ ను దాఖలు చేసింది. ఫైనాన్స్ బిడ్స్ ను దాఖలు చేయడానికి అవసరమైన గడువును 45 రోజులుగా నిర్ధారించింది. తొలి దశలో 13,000 కోట్ల రూపాయలు, 35 ఏళ్ల కాల వ్యవధిలో దశలవారీగా మిగిలిన 17,000 కోట్ల రూపాయలను ఈ కన్సార్టియం కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఈ మేరకు టెక్నికల్ బిడ్స్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. వందే భారత్‌ కోచ్ ల తయారీని ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేయడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)