డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రయాణంలో బలమైన మొదటి అడుగుగా డిజిటల్ పేమెంట్స్ను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ మంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ పద్ధతి దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉంది. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిజికల్ క్యాష్, వ్యాలెట్లు మోసుకెళ్లే భారం దాదాపుగా తగ్గిపోయింది. స్మార్ట్ఫోన్ నుంచి సులువుగా పేమెంట్స్ చేసే వీలు కలగడంతో తక్కువ కాలంలోనే యూపీఐ పాపులర్ అయిపోయింది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే వంటి వివిధ యాప్ల ద్వారా చిన్న విక్రేతలు, వ్యాపార యజమానులు పేమెంట్స్ స్వీకరించే అవకాశం కలిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఒక వినియోగదారుడు ఒక రోజులో యుపీఐ ద్వారా రూ.లక్ష వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. అంతే కాకుండా ఒక రోజులో యుపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయగల మొత్తం ఆయా బ్యాంకులు, ఉపయోగిస్తున్న యాప్లపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే 24 గంటల్లో రూ.లక్ష కంటే ఎక్కువ యుపీఐ పేమెంట్ను ఏ బ్యాంకు అనుమతించదు. అమెజాన్ పే యూపీఐ ద్వారా రోజులో రూ.లక్ష వరకు పేమెంట్స్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ఒక రోజులో 20 ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. కొత్త వినియోగదారులు మొదటి 24 గంటల్లో రూ.5,000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. గూగుల్ పే లేదా జీ పే వినియోగదారులు యుపీఐ ద్వారా ఒక్క రోజులో రూ.లక్ష కంటే ఎక్కువ పంపలేరు. అదే విధంగా యాప్ వినియోగదారులు ఒక రోజులో 10 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే గరిష్ఠంగా రూ.లక్ష పంపగలరు, రోజులో వివిధ మొత్తాల్లో 10 ట్రాన్సాక్షన్లు మాత్రమే చేయగలరు. ఫోన్పేకి కూడా గూగుల్పే తరహాలోనే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.లక్ష గానే ఉంది. రోజులో రూ.లక్షకు మించి పేమెంట్స్ను అనుమతించదు. అయితే ఈ యాప్లో ఒక రోజులో 10 ట్రాన్సాక్షన్ల లిమిట్ లేదు. అదే విధంగా అవర్లీ లిమిట్ కూడా లేదు. రూ.లక్ష విలువ దాటకుండా రోజులో ఎన్ని ట్రాన్సాక్షన్లు అయినా చేసుకోవచ్చు. పేటీఎం నుంచి కూడా రోజుకు రూ.లక్ష విలువైన ట్రాన్సాక్షన్లు మాత్రమే చేయగలరు. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. రూ.లక్ష విలువ దాటకుండా రోజుకు పేటీఎం కస్టమర్లు ఎన్ని ట్రాన్సాక్షన్లు అయినా చేయవచ్చు.
యూపీఐ ట్రాన్సాక్షన్స్పై లిమిట్ !
January 03, 2023
0
Tags