మహిళలకు సమాంతర రిజర్వేషన్లు !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా మల్టీజోన్లు, జోన్లు, జిల్లాలు వచ్చాయి. దీంతో ఉద్యోగాల భర్తీకి రోస్టర్‌ తొలి పాయింట్‌ నుంచి లెక్కించి పోస్టులను ఆయా ప్రభుత్వ విభాగాలు రిజర్వు చేశాయి. దీంతో గ్రూప్‌-1లో పేర్కొన్న 503 పోస్టుల్లో రోస్టర్‌ పాయింట్ల ప్రకారం మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి. దీంతో కొందరు ఉద్యోగార్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. రాజస్థాన్‌ పీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష ఎంపికలో సమాంతర రిజర్వేషన్లు అమలయ్యాయి. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలకు కూడా వర్తింపజేయడానికి సిద్ధమైంది. ఈ పద్ధతి పాటిస్తూనే తుదిజాబితాలు రూపొందించనుంది. సాధారణంగా ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 (1/3) శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. ఈ మేరకు 100 రోస్టర్‌ పాయింట్ల పట్టికలో ఓపెన్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగుల వర్గాలకు కేటాయించిన పోస్టుల్లో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వ విభాగంలోని ప్రతి పోస్టును ఒక యూనిట్‌గా తీసుకుని వంద రోస్టర్‌ పాయింట్లు పరిగణనలోకి తీసుకుని లెక్కించినపుడు మహిళలకు 33 శాతం పాయింట్లు మాత్రమే రిజర్వుగా ఉంటాయి. వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను కలిపి ఒకే ప్రకటన కింద పేర్కొన్నపుడు ఆయా విభాగాలు రోస్టర్‌ పాటిస్తూ రిజర్వు చేసిన ప్రకారం మహిళలకు పోస్టులు ఉంటాయి. ప్రభుత్వ విభాగాల వారీగా మంజూరైన పోస్టుల సంఖ్యను చూసినపుడు ఒక్కోసారి మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశముంది. ఉదాహరణకు ఒక ప్రభుత్వ విభాగంలో కేవలం మూడు పోస్టులు భర్తీ చేయాలని భావించినపుడు 100 రోస్టర్‌ పాయింట్ల ప్రకారం తొలి మూడు పోస్టుల్లో మొదటి రెండు మహిళలకు (ఒకటి ఓపెన్‌, రెండు ఎస్సీ), మూడోది ఓసీ జనరల్‌కు కేటాయిస్తారు. అప్పుడు ఆ విభాగంలో మహిళలకు రెండు పోస్టులు వచ్చినందున 66 శాతంగా కనిపిస్తాయి. ఒకవేళ రెండు మాత్రమే కేటాయించినపుడు వంద శాతం మహిళలకే రిజర్వు అయినట్లు అనిపిస్తాయి. అంత మాత్రాన వారికి పరిమితికి మించి ఇచ్చినట్లు కాదు. వేర్వేరు విభాగాల్లోని నోటిఫై చేసిన పోస్టులను కలిపి ఒక ఉద్యోగ ప్రకటన జారీ చేసినపుడు రోస్టర్‌ పాటించి మహిళలకు రిజర్వు చేసిన పోస్టులన్నీ కలిపి చూస్తే, 33 శాతానికి ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు. సమాంతర పద్ధతిలో ఓపెన్‌ కేటగిరీ (ఓసీ)తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకే రిజర్వుచేసిన పాయింట్లలో మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. ఈ లెక్కన మహిళలకు ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం దక్కేలా 33 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రోస్టర్‌ పాయింట్ల ప్రకారం మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వు అయితే ఆ పోస్టులు వారికే ఉంటాయి. వాటి సంఖ్యను తగ్గించడానికి వీల్లేదు. సమాంతర రిజర్వేషన్లు అమలు చేసినపుడు మహిళలు ఆయా ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగుల రిజర్వుడు కేటగిరీలోని జనరల్‌ కోటాలో మెరిట్‌ ప్రకారం వారికి కేటాయించిన సంఖ్యలో పోస్టులు సాధించినపుడు, ఆ రిజర్వుడు కేటగిరీలో మహిళల కోసం ప్రత్యేకంగా పేర్కొన్న పోస్టులను డీ-రిజర్వు చేస్తారు. ఉదాహరణకు.. ఒక సామాజిక వర్గంలో పది పోస్టులు ఉన్నాయనుకుందాం. వీటిలో 8, 9, 10 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన ఆ సామాజిక వర్గం నుంచి పది పోస్టుల్లో తొలి మూడు పోస్టులకు మెరిట్‌ ప్రకారం మహిళలు ఎంపికయ్యారనుకుందాం. అప్పటికే మహిళలకు రిజర్వు చేసిన పోస్టుల సంఖ్యలో ఎంపికైనందున వారికి ప్రత్యేకంగా కేటాయించిన 8, 9, 10 పోస్టులను మహిళా రిజర్వేషన్ల నుంచి డీ-రిజర్వు చేస్తారు. ఆ మూడు పోస్టులు ఆ సామాజిక వర్గంలో జనరల్‌ పోస్టులు అవుతాయి. ఒకవేళ ఏడో పోస్టు వరకు ఒక్క మహిళ కూడా మెరిట్‌లో జనరల్‌ కింద పోస్టు పొందకుంటే ఆ మూడు పోస్టులు అలాగే మహిళలకు రిజర్వుడుగా ఉంటాయి. ఒకవేళ తొలి ఏడు పోస్టుల్లో ఒక పోస్టుకు మాత్రమే మహిళ మెరిట్‌ కింద ఎంపికైతే మహిళలకు కేటాయించిన మూడు పోస్టుల్లో ఒకటి డీ రిజర్వు అవుతుంది. అప్పుడు డీ రిజర్వు అయి జనరల్‌గా మారిన పోస్టుకు ఆ రిజర్వుడు కేటగిరీలో మెరిట్‌ ప్రకారం మహిళలు, పురుషులు సమానంగా పోటీపడేందుకు వీలుంటుంది. ఒకవేళ మెరిట్‌ ఉంటే అన్ని పోస్టుల్లోనూ మహిళలు ఎంపికయ్యేందుకు అవకాశాలు ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)