'గాడ్సే' చిత్రాన్ని కూడా నిషేధించాలి !

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని బ్లాక్ చేసిన తరహాలోనే మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేపై త్వరలో విడుదల కానున్న హిందీ చిత్రం 'గాంధీ గాడ్సే-ఏక్ యుథ్' చిత్రాన్ని కూడా కేంద్రం నిషేధించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. డాక్యుమెంటరీని బీజేపీ ప్రభుత్వం బ్యాన్ చేసిన విధంగానే నాథూరామ్ గాడ్సేపై ప్రధాన మంత్రి, బీజేపీ నేతల అభిప్రాయాలను తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు. ''గాంధీని గాడ్సే కాల్చి చంపారు. దానిని బట్టి స్వతంత్ర భారతదేశంలో అతి పెద్ద టెర్రరిస్టు ఎవరు? ఇప్పుడు గాడ్సేపై ఓ సినిమా తీస్తున్నారు. ప్రధాన మంత్రి గాడ్సే సినిమాపై నిషేధం విధిస్తారా? లేదంటే అంతా వెళ్లి సినిమా చూడండని ప్రజలకు చెబుతారా?'' అని ఒవైసీ ప్రశ్నించారు. బీబీసీ మోదీ గురించి ఏదో చూపించిందని, అది సమస్యలు సృష్టిస్తుందని దానిపై నిషేధం విధించారని, ఇప్పుడు గాడ్సేను బ్యాన్ చేయాలని తాను సవాల్ చేస్తున్నానని అన్నారు. బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇందుకు సిద్ధమేనా అని అడిగారు. వలసవాదపాలన చట్టం సాకుతో ఇండియాలోని యూట్యూబ్, ట్విటర్‌లో బీబీసీ డాక్యుమెంటరీని మోదీ ప్రభుత్వం బ్లాక్ చేసిందనీ, అయితే తాను ప్రధానిని ఒక ప్రశ్న అడుగుతున్నాననీ, 2002 అల్లర్ల సమయంలో ఆయన గుజరాత్ సీఎంగా లేరా? బిల్కీ బానోపై అత్యాచారం జరిగింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ''మహాత్మాగాంధీ కంటే మోదీ గొప్ప కాదు. గాంధీ, అంబేడ్కర్ కంటే ఎవరూ గొప్పవారు కాదు'' అని అన్నారు. సిక్కు తీవ్రవాద నేత జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలేపై వచ్చిన సినిమాపై కూడా 2013లో నిషేధం విధించిన విషయాన్ని ఒవైసీ గుర్తుచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)