రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్లో ముగిసింది. ఈరోజు హర్యానాలోకి ప్రవేశించింది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో రాహుల్ నడక కొనసాగిస్తున్నాడు. అచ్చం రాహుల్ మాదిరిగా ఉండే వ్యక్తి జోడో యాత్రలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మీరట్కు చెందిన ఫైజల్ చౌదరి ఘజియాబాద్లో జోడో యాత్రలో కనిపించాడు. అచ్చం రాహుల్ మాదిరి టీషర్ట్ ధరించి పెరిగిన గడ్డంతో దర్శనమివ్వడంతో అంతా రాహుల్ గాంధీయే అని భ్రమించారు. తీరా దగ్గరగా చూశాక డూప్ రాహుల్ అంటూ నవ్వుకున్నారు. కొందరేమో ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇంకొందరేమో ఆయనకు షేక్హ్యాండిచ్చారు. ఈ సందర్భంగా ఆయన 'నేను రాహుల్ గాంధీని కాదు. ఆయనలా కనిపిస్తున్న ఫైజల్ చౌదరిని' అంటూ చెప్పడం కనిపించింది. తండ్రి నుంచి కాంగ్రెస్ మూలాలను వారసత్వంగా తీసుకున్న ఫైజల్ చౌదరి.. వీలు చిక్కినప్పుడల్లా కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నాడు. స్నేహితులంతా తనను రాహుల్ గాంధీ అని పిలుస్తారని, ఆయన అంటే ఎంతో గౌరవం ఉన్నందున లోని సమీపంలో జోడో యాత్రలో పాల్గొన్నట్లు ఫైజల్ చెప్పాడు. ఆయన మాదిరిగానే గడ్డం పెంచి టీషర్ట్ ధరించి యాత్రలో నడుస్తున్నానని, నడకలో పాల్గొంటున్నవారు తనను చూసి రాహుల్ అని భావిస్తున్నారని పేర్కొన్నాడు. చాలా మంది రాహుల్ అని భావించి తనతో కరచాలనం చేశారని, కొందరు కాళ్లు కూడా మొక్కారని ఆయన తెలిపాడు. తనను పెద్ద మనిషితో ప్రజలు పోల్చుకోవడం చాలా బాగుందని, బాగా ఆనందిస్తున్నానన్నారు.
జోడో యాత్రలో డూప్ రాహుల్ !
January 07, 2023
0
Tags