కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ను ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో శశిథరూర్కు క్లీన్చిట్ ఇవ్వటంపై ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. థరూర్పై ఉన్న అభియోగాలను కొట్టవేస్తూ గతేడాది పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. శశి థరూర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత ఢిల్లీ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ ఢీకే శర్మ పిటిషన్ కాపీని శశి థరూర్ న్యాయవాదికి అందించాలని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాదికి సూచించారు. పిటిషన్ కాపీ తమకు అందలేదని, అది ఉద్దేశ పూర్వకంగానే మరో మెయిల్కు పంపి ఉంటారని థరూర్ న్యాయవాది ధర్మాసనానికి తెలపడంతో ఈ మేరకు ఆదేశించారు. మరోవైపు.. రివిజన్ పిటిషన్ ఆలస్యానికి క్షమించాలని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి అప్పీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల పిటిషన్పై సమాధానం ఇవ్వాలని శశి థరూర్కు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని సూచించింది ధర్మాసనం. కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు.
సునంద మృతి కేసులో శశి థరూర్కు కోర్టు నోటీసులు
December 01, 2022
0
Tags