కర్ణాటకలోని మైసూర్ లో ఒక బస్టాప్ పైన మూడు డోమ్లు ఉండడాన్ని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ప్రతాప్ సింగ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాదు, వాటిని తొలగించకపోతే తన శైలిలో స్పందించాల్సి వస్తుందని బెదిరింపులు చేయడంతో రాత్రికి రాత్రే బస్టాప్ రూపు రేకల్ని మార్చేశారు. బస్టాప్ మీద మూడు డోమ్లు ఉండగా, రెండింటిని కూల్చి ఒక పెద్ద డోమ్ మాత్రం అలాగే ఉంచారు. ఇలా మూడు డోమ్లు ఉంటే మసీదులా కనిపిస్తోందని ఎంపీ ప్రతాప్ సింగ్ వాదన. ఆయన వాదనకు అధికారులు తలొగ్గక తప్పలేదు. ప్రతాప్ సింగ్ వార్నింగ్ ఇవ్వగానే, కాంట్రాక్టర్ రాందాస్కి భారత జాతీయ రహదారుల సంస్థ నుంచి నోటీసులు వచ్చాయి. అలా ఎందుకు నిర్మించారో చెప్పాలంటూ సదరు నోటీసుల్లో రాందాస్ ని ప్రశ్నించారు. నోటీసు అందుకున్న వెంటనే బస్టాప్ మీద ఉన్న రెండు డోముల్ని తొలగించారు. ఈ విషయమై రాందాస్ స్పందిస్తూ ''బస్టాప్ కాంట్రవర్సీకి వెళ్లొద్దని నేను అనుకుంటున్నాను. మైసూర్ లో నేను 12 బస్టాపులు నిర్మించాను. కానీ ఒక బస్టాప్ మీద మత ప్రభావం కనిపించేలా ఉందని అనిపించింది. అందుకే అలా కనిపించకుండా నా తప్పును నేనే సవరించుకున్నాను. పెద్దల సలహా ప్రకారమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది అభివృద్ధిలో భాగంగా తీసుకున్న నిర్ణయమే'' అని రాందాస్ అన్నారు. బస్టాప్ మీద డోమ్లు తొలగించిన అనంతరం బీజేపీ ఎంపీ ప్రతాస్ సింగ్ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. తన ట్వీట్లో ముందు రోజు బస్టాప్, రెండు డోమ్లు తొలగించిన అనంతరం బస్టాప్ ఫొటోలతో పాటు ఒక మసీదు ఫొటోను షేర్ చేస్తూ.. ''మూడు డోమ్లు ఉన్న బస్టాప్ చూస్తే అచ్చం మసీదులాగే కనిపిస్తోంది. మార్పుకు సమయం అడిగి మాట నిలబెట్టుకున్న జిల్లా కలెక్టర్కి, వాస్తవాన్ని అర్థం చేసుకుని ప్రజాభిప్రాయ సేకరణకు తలొగ్గిన రాందాస్కి ధన్యవాదాలు'' అని రాసుకొచ్చారు. అయితే ఈ డోమ్లు తొలగించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
Post a Comment
0Comments
3/related/default