అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పంచమహల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఓ వైపు కేజ్రీవాల్ మాట్లాడుతుండగా, మరోవైపు కొంతమంది 'మోదీ, మోదీ' అంటూ నినాదాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కేజ్రీవాల్ వారిని వద్దన్నారు. వారికి ఇష్టమైన నేతలకే జైకొట్టనివ్వాలంటూ ఆప్ కార్యకర్తలకు సూచించారు. కొంతమంది స్నేహితులు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కానీ వారి పిల్లలకు స్కూళ్లు నిర్మించి ఇచ్చేది మాత్రం ఈ కేజ్రీవాలే. మీరు ఎవరికి జైకొట్టినా మీకు ఉచిత విద్యుత్తు ఇచ్చేది ఈ కేజ్రీవాలే అంటూ జై కొట్టే వారిని ఉద్దేశించి ఆయన అన్నారు. మీకు నచ్చిన వ్యక్తికి జైకొట్టండి.. అంటూనే తమకు శత్రుత్వం ఎవరితో లేదని ఏదో ఒక రోజు మీ మనసులను గెలుస్తామని ప్రజల ముందు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు మీ దగ్గరకు వస్తున్నాయన్న కేజ్రీవాల్.. అందులో ఏ పార్టీ కూడా స్కూళ్లు, ఆసుపత్రులు కట్టిస్తానని చెప్పట్లేదంటూ విమర్శించారు. ఉచిత విద్యుత్తు ఇస్తామని కానీ ఉద్యోగాల కల్పన గురించి కానీ నిరుద్యోగ భృతి గురించి కానీ ఏ పార్టీ నేత కూడా మాట్లాడడని వివరించారు. 27 ఏళ్ల పాటు గుజరాత్ ప్రజలు వేరేవాళ్లకు అవకాశమిచ్చారు, మాకు ఒక్క ఐదేళ్లు అవకాశమిచ్చి చూడండి అంటూ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు.
మాకు ఒక్క ఐదేళ్లు అవకాశమిచ్చి చూడండి !
November 21, 2022
0
Tags