ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ ట్రిపుల్ ఎక్స్ లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని, ఈ దేశ యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని మండిపడింది. తనపై జారీ అయిన అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఏక్తా కపూర్ నేతృత్వంలోని ఓటీటీ ప్లాట్ఫాం ఆల్ట్బాలాజీ లో XXX వెబ్ సిరీస్ ప్రసారమవుతోంది. ట్రిపుల్ ఎక్స్ సీజన్ -2లో ఓ సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై బీహార్లోని బెగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తా కపూర్ను అరెస్టు చేసేందుకు వారంట్లు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది త్వరగా విచారణకు వస్తుందనే ఆశ లేదని చెప్పారు. ఇటువంటి కేసులో గతంలో అత్యున్నత న్యాయస్థానం ఏక్తా కపూర్నకు ఉపశమనం కల్పించిందని గుర్తు చేశారు. ఓటీటీ ప్లాట్ఫాంపై ప్రసారమవుతున్న కంటెంట్ సబ్స్క్రిప్షన్ ఆధారితమైనదని తెలిపారు. ఈ దేశంలో తమకు నచ్చిన కంటెంట్ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దీనిపై కోర్టు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సీటీ రవి కుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ, ఏదో ఒకటి చేయాలని తెలిపింది. ఈ దేశ యువతరం మనసులను మీరు కలుషితం చేస్తున్నారని మండిపడింది. ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రజలకు మీరు ఎలాంటి ఛాయిస్ను ఇస్తున్నారని నిలదీసింది. యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టింది. ''మీరు ప్రతిసారీ ఈ కోర్టుకు వస్తున్నారు. దీనిని సమర్థించలేం. ఇలాంటి పిటిషన్లను దాఖలు చేస్తున్నందుకు జరిమానా విధిస్తాం. రోహత్గీ గారూ, మీ క్లయింటుకు ఈ విషయాన్ని చెప్పండి. మంచి న్యాయవాదుల సేవలను పొందగలుగుతున్నారనే కారణంతో, నోరున్నవారి కోసం ఈ కోర్టు లేదు'' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ''నోరు లేనివారి కోసం ఈ కోర్టు పని చేస్తోంది. అన్ని రకాల సదుపాయాలు ఉన్నవారే న్యాయం పొందలేకపోతే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటో ఆలోచించండి. ఆర్డర్ను పరిశీలించాం, మా అభ్యంతరాలు మాకు ఉన్నాయి'' అని ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్పై విచారణను పెండింగ్లో పెడుతూ, హైకోర్టులో విచారణ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి స్థానిక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చింది.
యువత మనసుల్ని కలుషితం చేస్తున్నావ్ !
October 14, 2022
0
Tags