ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడురోజులపాటు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. దీనికి అనుబంధంగా మరో ఆవర్తనం కేంద్రీకృతమైంది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఇది కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. రాగల రెండురోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ వానలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మూడో రోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కనిపించనుంది. ఎల్లుండి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవి అలాగే కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలోనూ వాతావరణ శాఖ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలోనే ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమవడంతో..రాష్ట్రంపై అధిక ప్రభావాన్ని చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగలమూడురోజులపాటు ఇలాంటి వాతావరణమే ఉండనుంది. ఈమేరకు వెదర్ బులిటెన్ను అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు వెల్లడించాయి. తీరం వెంట పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తెలిపారు. ఇటు రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది.
తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ప్రభావం !
October 02, 2022
0