అక్టోబరు 22న రోజ్‌గార్‌ మేళా

Telugu Lo Computer
0


అక్టోబరు 22 ప్రధాని మోదీ 75 వేల మంది యువతతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్‌మెంట్‌ లెటర్లను అందించనున్నారు. అక్టోబరు 22న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ 'రోజ్‌గార్‌ మేళా'ను ప్రారంభించనున్నట్లు పీఎంఓ గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా రక్షణ, రైల్వే, హోం, కార్మిక-ఉపాధి శాఖలు, తపాలా శాఖ, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతతో మోదీ ముచ్చటించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు కూడా పాల్గొననున్నారు. విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఒడిశా నుంచి, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గుజరాత్‌ నుంచి, సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చండీగఢ్‌ నుంచి, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ మహారాష్ట్ర నుంచి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తమిళనాడు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. దేశంలో నిరుద్యోగంపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న 18 నెలల్లో 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే పలు ప్రభుత్వ విభాగాల్లో ఇటీవల ఉద్యోగాల భర్తీ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)