అండ కణాల నిల్వ హక్కును తోసిపుచ్చిన చైనా కోర్టు

Telugu Lo Computer
0


చైనాలో అండ కణాల నిల్వ  హక్కును కోరుతూ ఓ అవివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను  కోర్టు తోసిపుచ్చింది. ఆమె అండ కణాలను నిల్వ చేయడానికి ఆసుపత్రి నిరాకరించడం మహిళా హక్కులను ఉల్లంఘించినట్లు కాదని బీజింగ్‌లోని కవోయాంగ్ ఇంటర్మీడియేట్ పీపుల్స్ కోర్టు తీర్పు చెప్పింది. టెరెసా గ్జు అనే అవివాహిత ఈ పిటిషన్‌ను మూడేళ్ళ క్రితం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కవోయాంగ్ ఇంటర్మీడియేట్ పీపుల్స్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అవివాహితులు సంతాన సామర్థ్య చికిత్సలను పొందకూడదనే నిషేధం చైనా చట్టాల్లో స్పష్టంగా, బాహాటంగా లేదు. భర్త, భార్య కలిసి ముగ్గురు పిల్లల వరకు కనవచ్చునని మాత్రమే ఈ చట్టాలు చెప్తున్నాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆసుపత్రులు, ఇతర సంస్థలు మ్యారేజ్ లైసెన్స్‌ను చూపించాలని కోరుతూ ఉంటాయి. పిల్లలను కనాలనుకునే అవివాహిత మహిళలు ప్రసూతి సెలవుల కోసం, గర్భిణులుగా ఉన్నపుడు నిర్వహించే పరీక్షలు వంటివాటి కోసం చాలా కష్టపడవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో టెరెసా గ్జు 30 ఏళ్ళ వయసు ఉన్నపుడు బీజింగ్‌లోని అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఆసుపత్రికి వెళ్ళారు. ఇది కేపిటల్ మెడికల్ యూనివర్సిటీలో ఉంది. ఇది పబ్లిక్ హాస్పిటల్. తన అండ కణాలను నిల్వ చేయాలని కోరారు. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత, ''మీరు వివాహ ధ్రువపత్రాన్ని చూపించలేదు కాబట్టి మీ అండ కణాలను పరిరక్షించేందుకు నిల్వ చేయడం సాధ్యం కాదు'' అని ఆ ఆసుపత్రి అధికారులు చెప్పారు. యవ్వనంలో ఉన్నపుడే ఓ బిడ్డను కనాలని అక్కడి డాక్టర్ ఆమెకు సలహా ఇచ్చారు. అండ కణాలను నిల్వ చేయడం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలు ఉంటాయని ఆసుపత్రి వాదించింది. గర్భధారణలో ఆలస్యమవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని తెలిపింది. గర్భిణిగా ఉన్నపుడు ఇబ్బందులు వస్తాయని వాదించింది. పిల్లలకు వారి తల్లిదండ్రులకు మధ్య వయసు అంతరం మరీ ఎక్కువగా ఉంటే సామాజిక, మానసిక సమస్యలు ఎదురవుతాయని వాదించింది. ఎగ్ ఫ్రీజింగ్ సేవలు కేవలం సహజ సిద్ధంగా గర్భాన్ని ధరించడం సాధ్యం కాని మహిళలకు మాత్రమేనని, ఆరోగ్యంగా ఉన్నవారికి కాదని వివరించింది. తన అండ కణాలను నిల్వ చేసి, భవిష్యత్తులో పిల్లలను కనాలని భావించిన అవివాహిత అయిన టెరెసా గ్జు వుయ్‌చాట్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. తన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడం ఒంటరి మహిళల సంతానోత్పత్తి హక్కులపై దాడి కాదన్నారు. ఇది కేవలం తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని తెలిపారు. తాను ఈ తీర్పును సవాల్ చేస్తానని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)