జాన్సన్‌ మైనపు విగ్రహానికి 'వేకెన్సీ' బోర్డు పెట్టిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం

Telugu Lo Computer
0


బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్‌ను బ్లాక్‌పూల్‌, లండన్‌లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలు ఎగతాళి చేశాయి. బ్లాక్‌పూల్‌లోని మ్యూజియంలో ఉన్న ఆయన మైనపు బొమ్మను లాంకషైర్‌లోని ఓ జాబ్ సీకింగ్ సెంటర్ బయట పెట్టగా, లండన్‌లోని మ్యూజియంలో ఉన్న ఆయన మైనపు విగ్రహం వద్ద 'వేకెన్సీ' బోర్డును వేలాడదీసింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన శాల ప్రపంచ ప్రసిద్ధి చెందినది. బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సమాయత్తమవుతున్న సమయంలోనే బ్లాక్‌పూల్‌లోని ఈ మ్యూజియం సిబ్బంది ఆయన మైనపు విగ్రహాన్ని ఓ జాబ్ సీకింగ్ సెంటర్ బయటకు తరలించే ఏర్పాట్లలో తీరిక లేకుండా గడిపారు. ఈ మైనపు విగ్రహాన్ని మార్చిలోనే ఆవిష్కరించారు. దీనిని 20 మంది కళాకారులు వందల గంటల సమయాన్ని వెచ్చించి తయారు చేశారు. సూటు ధరించిన బోరిస్ జాన్సన్ తన నడుము మీద రెండు చేతులు పెట్టుకుని, నవ్వుతున్నట్లు కనిపిస్తున్న ఈ మైనపు విగ్రహాన్ని అత్యంత నైపుణ్యంతో తయారు చేశారు. ఆయన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన మరుక్షణం ఈ విగ్రహాన్ని జాబ్ సీకింగ్ సెంటర్ బయట పేవ్‌మెంట్‌పై పెట్టేశారు. దీనిని చూసినవారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కొందరు ఈ విగ్రహం వద్ద నిలబడి ఫొటోలు తీసుకుంటున్నారు. కొందరు ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. బ్లాక్‌పూల్ కూడలిలో బోరిస్ జాన్సన్ ఉన్నారని ఓ ట్విటరాటీ వ్యాఖ్యానించారు. బోరిస్ ప్రధాన మంత్రి పదవి నుంచి పూర్తిగా వైదొలగిన తర్వాత ఆయన మైనపు విగ్రహాన్ని పూర్తిగా తమ మ్యూజియం నుంచి తొలగిస్తామని లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు బ్రిటన్ మీడియాకు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)