అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అసోం అయితే చాలా రోజులుగా వరదల్లో మునిగిపోయి ఉంది. ఈ వర్షాలు, వరదల ప్రభావం తేయాకు ఉత్పత్తిపై పడే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాలు తేయాకు ఉత్పత్తికి ప్రసిద్ధి. దేశంలో ఉత్పత్తయ్యే తేయాకులో 81 శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే జరుగుతుంది. తేయాకు ఉత్పత్తిని వాతావరణం ప్రభావితం చేస్తుంది. భారీ వర్షాలకు తేయాకు ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అసోంలో 2021 జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో 27 శాతం టీ ఉత్పత్తి తగ్గిపోయింది. ఇందులో బ్రహ్మపుత్ర తీరంలోని తోటల్లో 11 శాతం, బరాక్ వ్యాలీలో 16 శాతం ఉత్పత్తి తగ్గింది. తేయాకు తోటలు వరదల్ని, కరువును రెండింటినీ తట్టుకోలేవు. అందువల్ల వరదలకు తీవ్రంగా నష్టం కలుగుతుంది. ప్రస్తుత వరదల కారణంగా ఎంత నష్టం జరిగిందో కచ్చితంగా తెలియదని, 15-20 రోజుల తర్వాతే ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందని అసోం టీ అసోసియేషన్ తెలిపింది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో గత జూన్లో తేయాకు ఉత్పత్తి 40 శాతం తగ్గింది. దువార్స్ డివిజన్ పరిధిలోని తోటల్లో 21 శాతం, తెరాయ్ ప్రాంతంలోని తోటల్లో 19 శాతం ఉత్పత్తి తగ్గింది. గరిష్ట ఉష్ణోగ్రతలో 1.5 డిగ్రీల తగ్గుదల ఉండటం వల్ల, ఎండ ఎక్కువసేపు ఉండకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు తేయాకు ధరలు గత మేలో 15 శాతం తగ్గాయి. తేయాకు ఎగుమతులు తగ్గిపోవడం, ఎరువులు, కూలీల ధరలు పెరగడం వల్ల తేయాకు ఉత్పత్తి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తేయాకు ఉత్పత్తి తగ్గుతుంది !
July 13, 2022
0
Tags